జమ్ముకశ్మీర్లో పరిస్థితులు అదుపులో లేవు. చొరబాటుదార్లకు, భద్రతా దళాలకు మద్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులతో పాటు భారత జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.
కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద చొరబాటుదార్లకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భారత్లోకి అక్రమంగా చొరబడడానికి చొరబాటుదారులు ప్రయత్నిస్తున్నారని, వారిని నిరోధించే క్రమంలోనే భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశాయి. ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు నియంత్రణ రేఖ వద్ద సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్, రెండు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. కాగా జమ్ముకశ్మీర్లో ఇటీవల ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చొరబాటుదార్ల చర్యలను సైన్యం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉంది. కాగా ముగ్గురు జవాన్లు చనిపోవడం బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు.