రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. జనజీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలయమం అయ్యాయి. ఇక హైదరాబాద్ మెట్రో పిల్లర్లకు కూడా వరద నీరు తాకింది.
మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద వరద తాకిడికి పిల్లర్ చుట్టు నిర్మించిన సర్ఫెజ్ వాల్ ధ్వంసమైంది. దీంతో మెట్రో పిల్లర్ చుట్టూ రోడ్డు కొట్టుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. మూసాపేట వద్ద వాహన రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. మెట్రో పిల్లర్ వద్ద భూమి కుంగి గుంతగా ఏర్పడి అందులోకి నీరు చేరింది. దీంతో మెట్రో పిల్లర్ల వద్ద ప్రమాదం ఏర్పడిందని వార్తలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో దీనిపై వార్తలు చక్కర్లు కొట్టాయి.
ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. నగరంలో మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రోపై వదంతులు నమ్మొద్దని కోరారు. మెట్రో నిర్మాణం అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం వీటికి కావాల్సిన మరమ్మత్తులు చేస్తామని తెలిపారు. దీంతో పబ్లిక్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అటువైపుగా వెళ్లే వాహనదారులతో పాటు సమీపాన ఉన్న వ్యక్తులంతా ఆందోళన చెందారు.