రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈసినిమాపై యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ దృష్టి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో బాలీవుడ్ తారలను కూడా నటింపజేస్తున్నారు. ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ తాజాగా హైదరాబాద్లో మళ్లీ మొదలైంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.200 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇలా విడుదలకు ముందే రూ.200 కోట్లు బిజినెస్ చేస్తోన్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక తెలుగులో అత్యధిక ధరకు డిజిటల్, శాటిలైట్ హక్కులు పొందిన సినిమాగా ‘సాహో’ ఉంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు రూ.150 కోట్లకు అమ్ముడయ్యాయి.