కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారిని అంతమొందించడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ప్లాస్మా థెరపీ. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను సేకరించి దానిని కరోనా సోకిన మరో వ్యక్తికి ఎక్కించడాన్నే ప్లాస్మా థెరపీ అంటారు. అయితే కరోనా నుంచి కోలుకున్న చాలా మంది పలు అపోహల కారణంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకురావట్లేదు. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అటు ప్రభుత్వాలు ఇటు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ఒక షార్ట్ మూవీని రూపొందించింది. ఇందులో నటి పాయల్ రాజ్పుత్ నటించడం విశేషం. ఇందులో ప్లాస్మా దానం ఎలా చేస్తారు? ప్లాస్మా దానం చేసినవారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వంటి విషయాలను సమగ్రంగా వివరించారు. ఈ వీడియోను పాయల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. షార్ట్ ఫిలిమ్తో పాటు.. ప్రజలకు ప్లాస్మా దానం చేయండని చెబుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ‘మీరు కూడా ప్లాస్మా దానాన్ని చేయండి, ఒకరి జీవితాన్ని కాపాడండి.. డొనేట్ ప్లాస్మా సేవ్ లైఫ్’ అంటూ ప్రజలకు సందేశాన్నిచ్చిందీ బ్యూటీ.