దేశంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రన్నింగ్లో ఉన్న వాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తమిళనాడులో తాజాగా ఓ సెల్ఫోన్ల లోడ్తో వెళుతున్న కంటెయినర్ను దుండగులు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
తమిళనాడులోని కృష్ణగిరిలో మొబైల్ ఫోన్ల లోడుతో వెళుతున్న కంటెయినర్ ట్రక్ను కొందరు దుండగులు హైజాక్ చేశారు. ఈ ట్రక్ చెన్నై నుంచి ముంబై వెళుతోంది. రెడ్మీ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ నుంచి ఫోన్లను పంపిస్తున్నారు. డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ వీటిని ముంబైకి రవాణా చేస్తోంది. అయితే దీనిపై కన్నేసిన దుండగులు మెలుమలై సమీపంలో కారుతో ట్రక్కును వెంబడించారు. కృష్ణగిరి సమీపంలో ట్రక్ను ఆపేశారు. ఆ తర్వాత వెంటనే ట్రక్కు డ్రైవర్ను, క్లీనర్ను కట్టేశారు. వెంటనే ట్రక్కుతో పరారయ్యారు.
కంటెయినర్ ట్రక్కులో 14 వేల 5 వందల ఫోన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసును ఛేధించేందుకు 17 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఇది పక్కా ప్రణాళికతోనే చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగనుంది. ఈ మధ్య కాలంలో రన్నింగ్లో ఉన్న వాహనాలను దొంగలు టార్గెట్ చేశారు. అసలు వెహికల్స్ని ఆపకుండానే వెనక భాగంలోనే అందులోకి ప్రవేశించి దోచుకెళుతున్న ఘటనలు ఇప్పటికే వెలుగు చూశాయి. కాగా చెన్నైలోని టి.నగర్ బస్టాండు సమీపంలోని మూసా వీథిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో దొంగలు పడి రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వీటి కోసం కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.