తనపై అత్యాచారం చేయబోగా అతన్ని ప్రతిఘటించి చంపేసింది ఓ యువతి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
దేశంలో ఇటీవల అత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని మహిళ చంపేయడం సంచలనం రేపుతోంది. భోపాల్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని గుణ జిల్లా అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మ తనపై అత్యాచార యత్నం చేయబోగా అతన్ని వంటగదిలోని కత్తితో పొడిచి చంపానని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అయితే అతను ఇదివరకే తనపై అత్యాచారం చేశారని తెలిపింది.
తనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే తన పొరుగింట్లో ఉండే శర్మ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని వెల్లడించింది. అయితే అప్పుడు వీడియో తేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు తనపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు చెప్పింది. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. అయితే తన భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారని పేర్కొంది. దీంతో మద్యం మత్తులో ఉన్న శర్మ తన ఇంటికి వచ్చి అత్యాచార యత్నం చేశాడని, దీంతో తాను వంటగదిలోని కత్తితో 25 పోట్లు పొడిచి చంపానని మహిళ అంగీకరించింది.
2005వ సంవత్సరం నుంచి తనపై అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇలాంటి వ్యక్తులకు మొదట్లోనే కఠిన శిక్షలు విధించాలని పబ్లిక్ కోరుతున్నారు.