ఉగ్రవాదం నుంచి బయటకు వచ్చినా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఉగ్రవాది తన కార్యకలాపాలు మానుకొని మామూలు మనిషిగా జీవిస్తున్నప్పటికీ అతనికి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా జమ్ముకశ్మీర్లో మాజీ ఉగ్రవాదిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో గుర్తుతెలియని ఉగ్రవాదులు మాజీ ఉగ్రవాదిపై కాల్పులు జరిపిన ఘటన చోటుచేసుకుంది. పుల్వామా జిల్లా కాకపోర ప్రాంతంలో మాజీ ఉగ్రవాది తన్వీర్ అహ్మద్ సోఫీపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈయన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో పని చేస్తుండేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం అవన్నీ విడిచిపెట్టి లొంగిపోయాడు. ప్రస్తుతం పట్టు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈయనపై ఇప్పుడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీ.ఆర్.ఎఫ్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తన్వీర్ కడుపులో బుల్లెట్ దూసుకుపోయింది. బుల్లెట్ గాయమైన తన్వీర్ ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గులాం ముహమ్మద్ సోఫి కుమారుడైన తన్వీర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీళ్లే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. సరిహద్దులో చైనా, పాకిస్తాన్ ఎప్పుడు ఏ చర్యకు పాల్పడతాయో అన్న అనుమానంతో భద్రతా బలగాలు అలర్ట్గా ఉన్నాయి.