ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగకు పబ్లిక్ ఇబ్బందులు పడకూడదని ఆర్టీసీ ముందుగానే అలర్ట్ అయ్యింది. ఈమేరకు ప్రయాణీకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులను పెంచింది. శుక్రవారం నుంచి ఏపీలో బస్సులు అన్ని రూట్లలో అందుబాటులో ఉంటాయి.
దసరా పండగను పురస్కరించుకుని ఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే తెలంగాణాకు మాత్రం బస్సులు నడపడం లేదు. ఎందుకంటే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడం లేదు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారు ఇంకా ప్రైవేటు బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం రేట్లు పెంచేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణాలో తిప్పేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త మెలికలు పెడుతున్నట్లు తెలుస్తోంది. బస్సుల సంఖ్యతో పాటు కిలోమీటర్లు కూడా తగ్గించుకునేందుకు ఇప్పటికే ఏపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ బస్సులు తిప్పే టైమింగ్స్ కూడా తెలంగాణా ఆర్టీసీ డిసైడ్ చేస్తామని చెబుతోందట. కాగా సరిహద్దులో ఒక్క కర్నాటకకు మాత్రమే ఏపీ నుంచి బస్సులు తిరుగుతున్నాయి. తమిళనాడు కూడా కరోనాను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏపీ నుంచి బస్సులను అనుమతించడం లేదు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.