కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఎందుకంటే జీఎస్టీ రెవెన్యూ కింద ఇచ్చే పర ఇహారం విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనపై కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.
జీఎస్టీ వ్యవస్థలోకి మారాక వచ్చే ఆదాయ లోటు భర్తీని ఐదేళ్లపాటు తామే భరిస్తామని 2017లో కేంద్రం అంగీకరించింది. కొవిడ్ కారణంగా రాష్ట్రాల బడ్జెట్లు అస్తవ్యస్తమైపోయి, ద్రవ్యలోటు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరపు జీఎస్టీ సెస్ చెల్లింపులు కూడా కేంద్రం చేయకపోవడంతో రాష్ట్రాలు గళమెత్తాయి. కేంద్రం కూడా అదే కొవిడ్ కారణంగా చూపి ఈ ఏడాది ఆ నష్టపరిహారం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలు మార్కెట్ నుంచి తమ పరిధికి మించి అప్పు తెచ్చుకోవాలని కేంద్రం తెలిపింది.
దీనికి కాంగ్రెస్ సహా విపక్ష పాలిత రాష్ట్రాలు ఒప్పుకోలేదు. 20 బీజేపీ, దాని మిత్రపక్షాల రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు ఆ లక్షా 10వేల కోట్లూ తామే తెస్తామని ఇప్పుడు కేంద్రం చెబుతోంది. రాష్ట్రాలకు రావాల్సిన పరిహారం మొత్తా న్ని తామే వివిధ సంస్థల దగ్గర నుంచి అప్పుగా తెస్తామని ఆర్థికశాఖ తెలిపింది. నిజానికి ఈ పరిహారంపై రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్రాలకే అవకాశం ఇస్తూ కేంద్రం కొద్దివారాల కిందట ప్రకటన చేసింది. అయితే ఈ సూచనకు రాష్ట్రాలూ అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ ఈ తెచ్చే అప్పుకు వడ్డీ, అసలు ఎవరు కడతారన్నది ఆర్థికశాఖ వివరించలేదు. జీఎస్టీ చట్టం ప్రకారమైతే దీన్ని కేంద్రమే కట్టాలి.