దేశంలో తుపాన్లు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల వచ్చిన నివర్ తుపాన్ చెన్నై ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తమిళనాడులో భారీ నష్టం చేకూర్చింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అయితే చెన్నైకు మరో గండం పొంచి ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. చెన్నైలో ఈ సంవత్సరం భారీ స్థాయిలో తుపాన్లు వచ్చాయి. ప్రజల జీవనం స్థంబించిపోయింది. కాలనీల్లో నడుములలోతు నీళ్లు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ తుపాన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. ఏపీలో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పుడు మరోసారి వర్షాలు వస్తాయన్న అధికారుల సూచనలతో ఒక్క చెన్నైలోనే కాకుండా పక్కనన్న రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రధానంగా ఏపీలో వై.ఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నారు.