దేశంలో జమిలి ఎన్నికల టాపిక్ చాలా రోజుల క్రితం వచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సైతం జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు. దీంతో దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. అయితే జమిలి ఎన్నికలు వస్తాయా రావా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
జమిలి ఎన్నికల గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే.. దేశంలో జమిలీ ఎన్నికలు అనే అంశం చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్కు ఎంతో అవసరమని నొక్కి వక్కానించారు. కొన్ని నెలల వ్యవధిలోనే పదే పదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు. అందుకే వాటిని ఒకేసారి నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు. ‘‘వేర్వేరు చోట్ల కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు చర్చించాల్సిన ఆవశ్యకతా ఉంది.’’ అని ప్రధాని మోదీ సూచించారు.
కాగా జమిలి ఎన్నికలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ‘ఒకే దేశం… ఒకే ఎలక్షన్’ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ‘‘జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత… వన్ కంట్రీ- వన్ నేషన్’ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే.’’ అని సునీల్ అరోరా ప్రకటించారు. ఇలా ప్రధానమంత్రి, ఎన్నికల సంఘం వ్యాఖ్యలను బట్టి చూస్తే జమిలి ఎన్నికలపై ఏమైనా కదలిక వస్తుందా అన్న ఆలోచన సామాన్యుల్లో మొదలైంది.