ప్రపంచంలో కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. పలు దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఆయా దేశాలు సరిహద్దులను మూసివేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి ప్రజలు రావడానికి. స్వదేశం నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నాయి.
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కల్లోలంతో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తో అల్లాడిపోయిన బ్రిటన్, దక్షిణాఫ్రికాను ఈ కొత్త స్ట్రెయిన్ తీవ్రంగా కలవర పెడుతోండటంతో ముందు జాగ్రత్తగా సౌదీ అరేబియా తన భూ సరిహద్దులను మూసివేసింది. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కనుగొన్న నేపథ్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. విమానాల రాకపోకల రద్దును మరో వారం రోజుల పాటు పొడిగించవచ్చని సౌదీ అధికారులు చెప్పారు.
యూరోపియన్ దేశాల నుంచి సౌదీఅరేబియాకు వచ్చిన వారు, కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకిన వారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సౌదీ అధికారులు ఆదేశించారు. గత మూడు నెలల్లో యూరప్ దేశాల్లో పర్యటించిన వారు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సౌదీ సర్కారు ఆదేశించింది. యూకే, డెన్మార్కు, నెదర్లాండు, దక్షిణాఫ్రికాల నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టర్కీ కూడా ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ పెరిగిన నేపథ్యంలో డెన్మార్కు, నెదర్లాండు, దక్షిణాఫ్రికా దేశాల నుంచి విమానాలను రద్దు చేశామని టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా ట్వీట్ చేశారు. మొరాకో దేశం కూడా యూకేతో విమాన రవాణాను నిలిపివేసింది.