కరోనా వైరస్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరో వైరస్ విజృంభణ చేయనుందా అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ప్రపంచ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాధి సోకుతున్న విషయం తెలిసిందే. ఇక మన దేశంలో కూడా షిగోలా అనే కొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. కేరళలో ఈ వైరస్కు సంబంధించిన కేసులు నమోదు అవుతున్నాయి.
ఉత్తర కేరళలో మెల్లమెల్లగా వ్యాప్తిచెందుతున్న షిగోలా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యమంత్రి కే కే శైలజ సూచించారు. రాష్ట్రంలోని కాలీకట్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక షిగోలా వైరస్ కారణంగా మృతి చెందిందని తెలిపారు. షిగోలా వైరస్ వ్యాప్తి చెందుతుంటుందని, ఈ వైరస్ సోకినపుడు డయేరియా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
కోజికోడ్ జిల్లా మెడికల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 56 డయేరియా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఆరు షిగోలా వైరస్ కేసులను గుర్తించామని తెలిపారు. వీరిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొందరు కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు. మిగిలిన బాధితులలో ఎవరికీ తీవ్ర అస్వస్థత లేదన్నారు. కాగా ఆరోగ్యశాఖ మంత్రి శైలజ మాట్లాడుతూ రాష్ట్రంలో షిగోలా వైరస్ రిపోర్టు తొలిసారిగా వచ్చిందన్నారు. ఈ వైరస్ కలుషిత నీటి కారణంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అందుకే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. అలాగే అందరూ పరిశుభ్రత పాటించాలని కోరారు.