చిరుత పులి అంటేనే భయపడతాం. ప్రపంచంలో ఉన్న పులులు, చిరుత పులులు క్రమేపీ అంతరించిపోతున్నాయని మనం చదువుతూనే ఉన్నాం. తాజాగా మరో చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. ఈ చిరుత పేరు సచిన్.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరంలోని బెంగాల్ సఫారీ పార్కులో ఓ మగ చిరుతపులి అనారోగ్యంతో మరణించింది. 2018వ సంవత్సరంలో బెంగాల్ టీ తోటల్లో సంచరిస్తుండగా చిరుతపులిని పట్టుకొని సిలిగిరి సఫారీ పార్కుకు తరలించారు. ఈ చిరుతపులికి ‘సచిన్’ అని పేరు పెట్టి సఫారీ పార్కులో పెట్టారు. ఈ చిరుతపులి ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిందని సిలిగురి సఫారీ పార్కు డైరెక్టరు బాదల్ దేబ్నాథ్ చెప్పారు. మరణించిన చిరుతపులి అడవిలో జన్మించినందున దాని వయసు చెప్పలేమని డైరెక్టరు చెప్పారు. బెంగాల్ సఫారీ పార్కులో మరో జంతువు అనారోగ్యానికి గురవడంతో చికిత్స చేస్తున్నామని డైరెక్టరు వివరించారు. కాగా చిరుత మృతితో జంతుప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.