అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఆదివారానికి అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకుంటుంది.
రాజకీయేతర ఐకాసా ఆద్వర్యంలో అనంతవరంలో రైతులు రైతు కూలీలు కలిసి నూతన దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. పెదపరిమి, ఉండవల్లి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, మందడం, దొండపాడు, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వంద రోజుల దీక్ష చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
అమరావతిని సాధించేవరకు పోరాడతామని వారు అంటున్నారు. సీఎం జగన్ మొండి అయితే తాము జగమొండి అంటున్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ అతిథిగృహానికి 30 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అమరావతి రాజధానికి 33వేల ఎకరాలు కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇక అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో రాష్ట్రపతికి లేఖ రాశారు. మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ప్రకటనలు, అఫిడవిట్లు ఊహించని పరిణామాలకు దారితీస్తాయని లేఖలో పేర్కొన్నారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం రాజధాని రైతులకు మద్దతుగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం 250వ రోజుకు రైతుల ఆందోళనలు చేరుతున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దామన్నారు చంద్రబాబు. మొత్తానికి అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించినా ఇంకా రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.