మాజీ మంత్రి టిడిపి నేత అచ్చెన్నాయుడు మరో కొత్త కేసులో ఇరుక్కుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆప్కో కేసు కూడా విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఈఎస్ఐ కుంభకోణంలో 150 కోట్ల మేర అవినీతి జరిగిందని పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా ఆయన రిమాండ్లోనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో అచ్చెన్నాయుడుతో పాటు పలువురు అధికారులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఆప్కోలో భారీ కుంభకోణం జరిగిందన్న దానిపై సీఐడి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో అప్పట్లో ఆప్కో చైర్మన్గా పని చేసిన కడప జిల్లా వాసి గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా సమాచారం ఇంకా బయటకు రాలేదు. మరి ఈ కసుకు అచ్చెన్నాయుడుకు సంబంధం ఏంటంటే అప్పట్లో అచ్చెన్నాయుడు చేనేత, జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు.
2014లో టిడిపి అధికారం చేపట్టిన తర్వాత అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన రవాణా, బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆప్కో చేనేత జౌళి శాఖ కిందకు వస్తుంది. దీంతో ఆప్కోలో జరిగిన భారీ కుంభకోణంలో అచ్చెన్నాయుడుకు ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.