కరోనాను క్యాష్ చేసుకొని దోపిడీ చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసుల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్జకు పాల్పడుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఓ హాస్పిటల్ను సీజ్ చేశారు అధికారులు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మరళీకృష్ణ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా బాదితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్పై దాడులు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై విచారణ చేయగా.. నిజమని నిర్ధారించుకున్నారు. హాస్పిటల్ను సీజ్ చేశారు.
ఇటీవల కర్నూల్లో ఓ పేషెంట్ సాదారణ మరణం చెందినా కరోనా మరణమంటూ అంత్యక్రియలకు డబ్బులు వసూలు చేశారు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది. రూ. 85వేలు కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. అయితే మృతుడి మరణదృవీకరణ పత్రంలో సాదారణ మరణమని, కరోనా కాదని వచ్చింది. దీంతో మృతుడి కుమారుడు బహిరంగంగా విషయాన్ని బయట పెట్టారు. తమ కుటుంబానికి జరిగిన దారుణం ఇంకెవరికీ జరగకూడదని ఆవేధన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా అధికారుల స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకొని ఇలా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వారి ఆగడాలు ఇప్పటికైనా ఆగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.