తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నోటీసులు పంపారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన దుష్ప్రచారంపై లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
విషయానికొస్తే ఇటీవల తమిళనాడులోని గుమ్మిడింపూడి సమీపంలో పోలీసుల వాహనాల తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బు బయట పడింది. అయితే ఈ సొమ్ము మంత్రి బాలినేనికి సంబంధిచినది అంటూ నారా లోకేష్తో పాటు పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తనిఖీల్లో రూ. 5 కోట్ల 27 లక్షలు దొరికాయి. వీటిని అక్రమంగా తరలిస్తున్నారని అప్పట్లో దుమారం రేగింది.
నారా లోకేష్తో పాటు కొందరు నేతలు, ఓ తమిళ, తెలుగు న్యూస్ ఛానల్కు ఈ విషయంలో బాలినేని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. డబ్బు బయటపడిన సందర్బంలో బాలినేనిపై వీరంతా విమర్శలు గుప్పించారు. అయితే ఒంగోలులోని ఓ బంగారు షాపు యజమాని నల్లమిల్లి బలరామ గిరీష్ ఆ డబ్బు తనకు సంబంధించినదే అని తెలిపారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరించారు.
ఇక ఈ విషయంలో మంత్రి బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేని నగదు విషయంలో తన పేరు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. అనవసరంగా తనపై విమర్శలు చేసిన వారు బహిరంగంగా తనకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నారా లోకేష్తో పాటు, ఏడుగురు టిడిపి నేతలకు, ఓ తమిళ, తెలుగు చానల్కు బాలినేని నోటీసులు పంపారు. ఏపీ రాజకీయాల్లో ఈ నోటీసుల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఆరరోపణలు, విమర్శలు ఉండాలి కానీ.. అందులో ఏమాత్రం నిజం లేకపోయినా ఇలా విమర్శలు చేసి వ్యక్తుల ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయకూడదని మేధావులు అంటున్నారు. లేదంటే ఇలా లీగల్లా ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.