తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇద్దరిపై వైసీపీ నేత, మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా టైం నుంచి ఇప్పటి వరకు వాళ్లు ఏపీలో ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం జూమ్ మీటింగుల్లో మాట్లాడుతూ మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ అన్ని విషయాలపై మంత్రి మాట్లాడారు.
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కనబడుటలేదని బోర్డు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఉన్న రైతుబజారులో ఉల్లి ప్రత్యేక విక్రయ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోకేష్ మొదటి సారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. వర్షాలకు, వరదలకు లోకేష్కు తేడా తెలియదని అన్నారు. ఇక తండ్రీ కొడుకులు ఇద్దరూ హైదరాబాద్లో కాపురం ఉంటూ ఏపీపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి విషయం గురించి మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరికో నోటిఫై చేసింది కాదని అన్నారు.
ఇక రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో నిత్యవసర వస్తువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం వద్ద బోర్డులు ఉండాలని.. వీటిని జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షించాలన్నారు. ఉల్లి ధర పెరగడంతో నాఫెడ్ ద్వారా ఆరు వేల టన్నుల ఉల్లి కొనుగోలుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని జిల్లా కేంద్ర రైతు బజార్లలో రేపటి నుంచి కిలో రూ. 40కు ఉల్లి విక్రయాలు చేస్తాం. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల తీసుకొచ్చి వినియోగదారులకు 40 రూపాయలే ఇచ్చి మిగిలిన సబ్సిడీ ధరను భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.