ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆ దిశగానే ఎన్నికల సంఘం కార్యచరణ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణపై ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు అర్థమవుతోంది.
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ కరోనా తీవ్రత దసరా తర్వాత పెరిగే అవకాశం ఉందన్నారు. నవంబర్, డిసెంబర్లో మరోసారి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని ఆయన తెలిపారు. అయితే బీహార్లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తావన వచ్చినప్పుడు.. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చకూడదన్నారు.
మంత్రి వ్యాఖ్యలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చిందనుకోవచ్చు. ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెల్లబోమని తేల్చిచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కరోనా కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నిపుణులు ఇదివరకే తెలిపారు. ఈ పరిస్థితుల్లో అప్పట్లో కరోనాను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేశారు. ఇలాంటప్పుడు కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ విషయంలో ఎన్నికల కమీషన్ ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాలి.