ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నారని ఆయన అన్నారు. ఇటీవల చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నాడని బాబు వ్యాఖ్యానించారు. ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, వైసీపీ రంగుల గురించి ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి ప్రచారం పిచ్చ పరాకాష్టకు చేరిందని.. సర్వేరాళ్లపై కూడా జగన్ రెడ్డి బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, గ్రానైట్ సర్వే రాళ్లు వేయడం, వాటిపై జగన్ రెడ్డి బొమ్మలు వేయడం మరో తుగ్లక్ చర్య అన్నారు.
ఇక అభివృద్ధిలో ఏపీ దిగజారిందన్నారు. దేశంలో 27వ స్థానంలో ఏపీని పెట్టారన్నారు. ప్రభుత్వం కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కోలేదని బాబు అన్నారు. ఇక చంద్రబాబు, లోకేష్పై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కనబడుటలేదని బోర్డు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ హైదరాబాద్లో కాపురం ఉంటూ ఏపీపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.