విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గీతం యూనివర్శిటీ వద్ద అదికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అటువైపుగా రోడ్లు మొత్తం బ్లాక్ చేసి ఈ పనులు చేపట్టారు. దీంతో అక్కడ ఏం జరుగనుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.
విశాఖలోని గీతం యూనివర్శిటీకి చెందిన పలు కట్టడాలని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి వీటిని నిర్మించారని కూల్చివేతలు ప్రారంభించారు. యూనివర్శిటీ ప్రధాన ధ్వారంతో పాటు ప్రహారీ గోడలో కొంత భాగం, సెక్యూరిటీ రూములను కూల్చివేశారు. గీతం యూనివర్సిటీ ఎదుట పోలీసులు, జీవీఎంసీ, అధికారులు భారీ స్థాయిలో మోహరించారు. వర్సిటీకి సంబంధించిన మరిన్ని నిర్మాణాలు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, నిర్మాణాలు తొలగిస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గీతం యూనివర్శిటీ వద్ద కూల్చివేతల నేపథ్యంలో బీచ్ రోడ్డు నుంచి యూనివర్శిటీకి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. ఇక ఎందుకు కూల్చివేస్తున్నారో తెలియడం లేదని యాజమాన్యం చెబుతోంది. గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూల్చివేతలు ప్రారంభించారని చెబుతున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందజేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఏపీలో వరుసగా టీడీపీ నాయకులను టార్గెట్గా చేసుకుని ప్రభుత్వం వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడిందని పలువురు మండిపడుతున్నారు. కూల్చివేతలు జరుగుతున్నాయని తెలియడంతో టిడిపి నేతలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకకు దారితీస్తుందో చూడాలి.