ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం కోవిడ్ కారణంగా ఎన్నికలు వద్దని అనుకుంటోంది.. అయితే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని చెబుతోంది. దీనిపై మంత్రులు టిడిపికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే సీఎం జగన్ వాల్యూ ఇస్తారని అంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో కరోనా విజృంభణ జరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని దీనిపై మాట్లాడుతూ టిడిపికి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలేదనుకోవద్దన్నారు. కోవిడ్ కు భయపడి కోర్టుల్లో సైతం వాదనలు ఆన్లైన్లో ఉంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. అయితే వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితి ఎలా ఉంది.. ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం జగన్ సర్కార్ జరపట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎలక్షన్ కమీషన్ ఎన్నికలను వాయిదా వేయడం.. ఆ తర్వాత దీనిపై ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టడం.. ఆ తర్వాత అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ మారిందని ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందునే ఎన్నికలు నిర్వహించట్లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ పార్టీ అధినేత, నేతలు సైతం ఇదే విషయం మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎటాక్ చేస్తోంది.