మత మార్పిడి, లవ్ జీహాద్ ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వీటన్నింటిపై ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020ని నవంబరులో జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్తూ మత మార్పిడికి పాల్పడిన వ్యక్తికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
పదహారేళ్ళ హిందూ బాలికను మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ టీనేజర్ను డిసెంబరు 15న అదుపులోకి తీసుకున్నారు. బాలికను నమ్మించేందుకు ఈ వ్యక్తి తన పేరును మార్చుకున్నట్లు బాలిక తండ్రి ఆరోపించారు. బిజ్నూర్ (గ్రామీణ) పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ, ధంపూర్కు చెందిన పదహారేళ్ళ దళిత బాలికను నిందితుడు సకీబ్ కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఆమె మతం మార్చేందుకు ప్రయత్నించాడన్నారు. ఆ బాలికను సకీబ్ కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని, బాలికను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
నిందితుడిని, బాలికను ప్రశ్నించిన తర్వాత సకీబ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, మతం మార్చేందుకు ప్రయత్నించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. సకీబ్ తన పేరు మార్చుకుని సోను అని ఆమెకు చెప్పినట్లు వెల్లడైందన్నారు. చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం టీనేజర్ సకీబ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.