చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది. దేశంలో ఏదో ఒక చోట పీటల మీద ఉన్న పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా ఈ ఘటనలు ఎక్కవ అవుతున్నాయి. వధువు, వరుడు బంధువుల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్నగర్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లి తంతు అంతా ముగిసిన తరువాత వరుడు… వధువును అక్కడే వదిలేసి కల్యాణమండపం నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇరుపక్షాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో వధువు తరపువారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పంచశీల నగర్ ప్రాంతానికి చెందిన రామ్ మోహన్ కుమారుడు మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి అశోక్ విహార్కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లికి వచ్చినవారంతా ఆనందంగా ఉన్న సమయంలో కానుకలు ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసింది.
ఇదే సమయంలో వధువును అక్కడే వదిలేసి వరుడు వెళ్లిపోయాడు. వధువు తరపువారు ఎంత నచ్చజెప్పినా వరుని తరపువారు మొండితనం వీడలేదు. దీంతో ఈ ఉదంతం పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇటీవల యూపీలోని పీలీభీత్లో ఒక పెళ్లి వేడుకలో మందు బాబులు చిందులు వేయడంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కూతురు ఈ పెళ్లి తనకు వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వివాదం మరింత ముదరడంతో పోలీసుల వరకూ చేరింది. వారు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.
ఇరుపక్షాలవారినీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే పెళ్లికుమార్తె ఈ పెళ్ళి వద్దంటూ మొండికేసింది. దీంతో వరుడు పెళ్లి కాకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఇలాంటిదీ ఇటీవల మరొకటి వెలుగు చూసింది. పెళ్లి భోజనాల పెట్టే వద్ద పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధువులకు గొడవ అవ్వడంతో పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.