ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఇంకా ఉదృతమవుతున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసే వరకు రైతులు ఆందోళనలు విరమించేలా కనిపించడం లేదు. ఇవాళ రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింఘ్, టిక్రీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణ నుంచి వేలాదిమంది రైతులు వచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రహదారులపై రైతులు దీక్ష చేస్తుంటే.. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. అలాగే ఢిల్లీ, జైపూర్ హైవే ముట్టడి కొనసాగనుంది. జైపూర్ మార్గంలో రాకపోకలకు ఆటంకాలు కలిగించే విధంగా ఆ రోడ్లను రైతులు దిగ్బంధించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
కాగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలు దీక్షలు చేపట్టారు. ఢిల్లీలో సీఎం కేజీవ్రాల్ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలు చేయాలని ఆప్ కార్యకర్తలకు కేజీవ్రాల్ పిలుపు ఇచ్చారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మరోవైపు రైతులతో చర్చలకు త్వరలో తేదీ ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది.