అమాయక ప్రజలను మోసం చేసే మాంత్రికుడు అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దెయ్యం విడిపిస్తానని చెప్పి ఇద్దరు బాలికలపై ఓ మాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
విషయం ఏమిటంటే.. తమిళనాడులోసి సేలం జిల్లాకు చెందిన ఓ రైతుకు ఇద్దరు కుమార్తెలు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే ఇటీవల వారి ప్రవర్తనలో తేడా కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బాలికలు ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటంతో దెయ్యం పట్టిందని అనుకున్నారు. దీంతో నామక్కల్ జిల్లాకు చెందిన శేఖర్ అనే మాంత్రికుడి వద్దకు వాళ్లకు తీసుకెళ్లారు. బాలికలకు దెయ్యం పట్టిందని, ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి దెయ్యం వెళ్లగొడతానని చెప్పిన శేఖర్ బాలికలను ఇక్కడే ఉంచి వెళ్లాలని తెలిపాడు.
అతని మాటలు నమ్మిన తల్లిదండ్రులు బాలికలను శేఖర్ ఇంట్లోనే ఉంచి వెళ్లారు. దీనిని అదునుగా తీసుకున్న అతను పలుమార్లు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికలు భయంతో జరుగుతున్న విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేదు. కానీ, మంత్రగాడి వేధింపులు అధికం కావడంతో జరిగిన విషయాన్ని వారు తల్లిదండ్రులకు వివరించారు. బాలికల తల్లిదండ్రులు మంగళాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు చేపట్టిన విచారణలో శేఖర్ నకిలీ మంత్రగాడని తేలింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శేఖర్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.