కరోనా వ్యాక్సిన్ గురించి కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడునాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ వెబినార్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా అప్రమత్తమైంది. ప్రజలు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక వైద్య పరంగా అందించాల్సిన అన్ని రకాల సదుపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
దీంతో కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు ప్రాధాన్యం సంతరిచుకున్నాయి. కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఇంకా ఏమన్నారంటే.. వచ్చే మూడునాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని తనకు నమ్మకం ఉందన్నారు. శాస్త్రీయ గణాంకాల ఆధారంగా వ్యాక్సిన్ ప్రాధాన్యాన్ని రూపొందిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వారియర్లకు సహజంగానే తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వృద్ధులు, రోగులకు ప్రాధాన్యం ఇస్తామని, టీకా పంపిణీ విషయంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. 2021 జులై-ఆగస్టు నాటికి 25-30 కోట్ల మంది ప్రజల కోసం 400-500 మిలియన్ డోసుల టీకా అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు.