తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠత నెలకొంది. అయితే జనవరిలో ఆయన రాజకీయ పార్టీ స్థాపిస్తానని చెప్పారు. దీంతో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇక మరి కొద్ది నెలల్లోనే తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రజినీ కొత్త పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ రజినీకాంత్ వస్తే ఆహ్వానించేందుకు సిద్దంగా ఉంది. అయినప్పటికీ రజినీ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తాజాగా రజినీ పార్టీపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం వల్ల అధికార అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చెక్కుచెదరదని, రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నరలక్షల మంది కార్యకర్తలు కలిగిన పటిష్ఠమైన పార్టీ తమదని ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందు అన్నాడీఎంకే ముందస్తు ఏర్పాట్లన్నీ ముగించిందన్నారు. సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడిని ప్రకటించిందని, ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో తయారవుతోందన్నారు.
రజనీకాంత్ దశాబ్దాల తరబడి పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారని, జనవరిలో పార్టీ ప్రారంభించిన తర్వాతే ఆయన ఆశయాలు, లక్ష్యాలు సమగ్రంగా తెలుసుకోవడానికి వీలుపడుతుందని పొన్నయ్యన్ అన్నారు. రజనీ ప్రారంభించే పార్టీయే కాదు, రాష్ట్రంలోని ఏ పార్టీల వల్ల కూడా అన్నాడీఎంకేకు ఎలాంటి నష్టం కలుగదని ఆయన అన్నారు. అన్నాడీఎంకేని ఓడించే శక్తితో కూడిన పార్టీగా రజనీ పార్టీ ఉండే ప్రసక్తే లేదన్నారు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు స్థాపిస్తానని చెప్పడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలను పుణికిపుచ్చుకున్న రజనీకాంత్ ద్రావిడ సిద్ధాంతాలను పెంచిపోషిస్తున్న తమిళనాట ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోవచ్చని తెలిపారు.