పిల్లలు అల్లరి చేస్తే కాస్త మందలించి వదిలేయాలి అంతే కానీ విచక్షణారహితంగా ప్రవర్తించకూడదు. ఇప్పటికే పలుచోట్ల పిల్లల పట్ల తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా దారుణంగా కొట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ట్యూషన్ టీచర్ పాప హోం వర్క్ చేయలేదని మరుగుతున్న నూనెను ఒంటిపై పోసేసింది. దీంతో విషయం తెలుసుకున్న వారంతా ఆగ్రహానికి గురవుతున్నారు.
యూపీలోని గోరఖ్పూర్లోని మియాబజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఎదురింట్లో ఉండే 16 ఏళ్ల యువతి వద్ద ట్యూషన్కు వెళుతున్నారు. రోజులాగానే సాయంత్రం ట్యూషన్కు వెళ్లారు. వారిలో ఐదేళ్ల బాలిక హోమ్వర్క్ చేయలేదు. ఈ విషయమై టీచర్ అడగగా, మరచిపోయానని ఆ బాలిక చెప్పింది. దీంతో ఆ టీచర్ మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇంటికి పంపించేసి, ఆ బాలికను మాత్రం తన దగ్గరే ఉండమంది. ఆ సమయంలో ట్యూషన్ చెబుతున్న ఆ యువతి తల్లి ఇంట్లో సమోసాలను నూనెలో వేయిస్తోంది.
ఆ మరుగుతున్న నూనెను ఆ యువతితోపాటు ఆమె తల్లి ఆ బాలిక చేతులు, శరీరంపై కొన్ని భాగాల్లో పోశారు. దీంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. వెంటనే తల్లి పోలీసులకు ఫోనుచేసి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న వారంతా ట్యూషన్ టీచర్ను తిట్టుకుంటున్నారు.