సూపర్స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆయన పొలిటికల్ పార్టీ ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగనున్నారు. తాజాగా అభిమాన సంఘాలతో జరిపిన సమావేశంలో ఈ మేరకు కీలక విషయాలు చర్చించారు.
తమిళనాడులో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇందుకు తగ్గట్టే ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తానని చాలా రోజు క్రితం ప్రకటించారు. అయినప్పటికీ ఇంకా ఆ విధంగా ముందుకు సాగలేదు. 2021లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి. దీంతో కచ్చితంగా రజినీ రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్షా కూడా చెన్నై వచ్చారు. అప్పుడు రజినీతో సమావేశం అవుతారని అనుకున్నా అది జరగలేదు. రజినీ సన్నిహితుడితో కలిసి మాట్లాడారు. ఈ బేటీలో కూడా కీలక విషయాలు చర్చించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయం రంగ ప్రవేశంపై ఉత్కంఠ దాదాపు వీగిపోయినట్లే. తలైవా సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రజనీకాంత్ పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2021 కల్లా తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అంతేవాసులు పేర్కొన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు. తన అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు రెడీగా ఉన్నారా, కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదు. మీరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలం అని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు ఉండాలా వద్దా అన్న విషయంలో మాత్రం సూపర్ స్టార్ ఓ నిర్ణయానికి ఇంకా రాలేదని సమాచారం. ఈ సమావేశంలోనే బీజేపీతో పొత్తు వద్దని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.