కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లైన కొత్త జంటలు కూడా కరోనా కారణంగా విడిపోతున్నాయి. కరోనాకు భయపడి భార్యకు దూరంగా ఓ భర్త ఉంటున్నాడు. తన భర్త నపుంసకుడని భావించి ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి.
మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ 29న వివాహం చేసుకున్న అతడు కరోనా భయంతో అప్పటి నుంచి భార్య వద్ద భౌతిక దూరం పాటిస్తున్నాడు. నెలలు గడుస్తున్నా అతడు దగ్గరికి రాకపోవడంతో అనుమానించిన భార్య అతడు సంసారానికి పనికిరాకపోవడం వల్లే తనతో దూరంగా ఉంటున్నాడని అనుమానించింది. దీంతో అతడిని విడిచిపెట్టి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నెల 2న ఆమెన్యాయసేవా సంస్థను ఆశ్రయించి.. తన భర్త సంసారానికి పనికిరాడని, నపుంశకుడు కావడంతో తనతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపింది. కాబట్టి అతడి నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరింది. తనతో మాట్లాడేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నాడని పేర్కొంది.
ఆమె ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించి అతడిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని విస్తుపోయారు. కరోనా భయం కారణంగానే భార్యకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. వివాహం జరిగిన వెంటనే తన భార్య కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది, ఆ భయంతోనే ఆమెకు దూరంగా ఉంటున్నాను తప్పితే మరేమీ లేదని చెప్పడంతో కౌన్సెలర్లు ఆశ్చర్యపోయారు. తనకు వైరస్ సోకుతుందన్న భయం అతడిలో పాతుకుపోయిందని, తన భార్యలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండడంతో ఆమెలో లక్షణాలు బయటపడడం లేదని అతడు విశ్వసిస్తున్నట్టు చెప్పాడని కౌన్సెలర్లు తెలిపారు.