ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక అమెరికాలో సైతం కరోనా విలయతాండవం చేస్తోంది. గత రెండు నెలలుగా అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
అమెరికాలో 2020, జనవరిలో తొలి కరోనా వైరస్ కేసు వెలుగు చూసింది. తరువాత 100 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే కొత్తగా 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన మంగళవారం నుంచి శనివారం మధ్య కొత్తగా 10,00,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా కారణంగా 2,81,199 మంది కన్నుమూశారు.
నవంబరు నుంచి ప్రతీరోజూ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికితోడు వివిధ ఆసుపత్రులలో చేరుతున్న కరోనా బాధితులు సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు మాత్రం బాగా ఉంది. ప్రపంచ దేశాల్లో భారత్లోనే ఎక్కువగా రికవరీ రేటు ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కేసులు పెరుగుతున్నా అక్కడి ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాయి.