కరోనా విజృంభిస్తోంది. ప్రజలు శుభకార్యాల పేరుతో చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పలువురికి కరోనా సోకింది. దీంతో ఇప్పుడు ఆ ఫంక్షన్కి హాజరైన వారంతా ఆందోళనలో ఉన్నారు.
యూపీలోని ఫిరోజాబాద్లో పెళ్లికొడుకు మృతి చెందిన నేపధ్యంలో వధువుతోపాటు వారి కుటుంబంలోని 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరి కుటుంబంలో నవంబరు 25న వివాహం జరిగింది. డిసెంబరు 4న కొత్త పెళ్లికొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ, ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదు.
ఫిరోజాబాద్ పరిధిలోని నాగలా సావంతి గ్రామంలోని ఒక కుటుంబం చూపిన నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, 9 మందిని అనారోగ్యంపాలు చేసింది. పెళ్లికొడుకు తరపువారు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి అయిన తరువాత పెళ్లికొడుకులో జలుబు, జ్వరంలాంటి లక్షణాలు కనిపించాయి. తరువాత ఆరోగ్యం విషమించి, డిసెంబరు 4న అతను మృతి చెందాడు. దీంతో వారి ఇంట్లోనివారంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు. మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఒకే కుటుంబంలోని 9 మందికి కరోనా సోకడంతో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.