సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీ.ఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే. ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ స్పందించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వై.ఎస్ జగన్ లేఖ రాయడంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను బెదిరించడానికి జగన్ కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై జగన్ రాసిన లేఖ కోర్టు దిక్కారం కిందికే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణల్లో ఎలాంటి హేతుబద్ధత లేదని తెలిపింది. జగన్ రాసిన లేఖ ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని వొమ్ము చేసేలా ఉందని బార్ అసోసియేషన్ పేర్కొంది.
సీఎం జగన్ రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమేనని తీవ్ర స్థాయిలో స్పందిస్తూనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. కాగా దీనిపై ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠత నెలకొంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పూర్తి స్థాయిలో లేఖలో పొందుపరుస్తూ సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీలో ఇది పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే.