కరోనా వ్యాక్సిన్ విషయంలో దేశాల మధ్య పోటీ నెలకొంది. మొదటగా రష్యా కరోనా వ్యాక్సిన్ను కనిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా కేసులు అత్యంత ఎక్కువగా ఉన్న అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్ను ప్రజలకు అందజేస్తోంది. అయితే భారత్ మాత్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా ముందుకు వెళ్లలేదు.
ఈ పరిస్థితుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సామర్థ్యం ఏకంగా 95 శాతమని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎక్జిక్యుటివ్ పాస్కల్ సొరియోట్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 95 శాతం మంది కరోనా బారిన పడకుండా తమ టీకా కాపాడగలదని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు కష్టపడి..ఈ టీకా సామర్థ్యాన్ని మిగతా వాటితో సమానంగా అభివృద్ధి చేయగలిగారని తెలిపారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని గతంలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాస్కల్ సోరియెట్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే..తన ప్రకటనలకు మద్దతుగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి డాటాను ఆస్ట్రాజెనెకా ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గతంలో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో..టీకా సగటు సామర్థ్యం 70 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది. మరోవైపు.. ఫైజర్, మోడర్నా టీకాల సామర్థ్యం వరుసగా 95 శాతం, 94.5 శాతం ఉన్నట్టు తేలింది. ఇక బ్రిటన్లో పుట్టిన కొత్త వైరస్ స్ట్రెయిన్ను కూడా ఆక్స్ఫర్డ్ టీకా సమర్థంగా నిలువరించగలదని పాస్కల్ సొరియెట్ స్పష్టం చేశారు.