కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనిపై ప్రభుత్వం కూడా అందరికీ ప్రచారం కల్పిస్తోంది. ప్రధానంగా పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా ఒకే చోట గుంపులు గుంపులుగా ఉండకూడదని చెబుతోంది. అయినప్పటికీ పలువురు పబ్లిక్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో ఇదే జరిగింది.
కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా పార్టీ నిర్వహించినందుకు గాను సుమారు 200 మందిపై కేసు నమోదైంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పోజియూర్ బీచ్లో ఈ నెల డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏమాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా పార్టీ నిర్వహిస్తున్న కారణంగా వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫ్రీక్స్ అని పిలుస్తోన్న ఒక గ్రూప్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. వీరంతా పోజియూర్ బీచ్కి సమీపంలో నివసించే వారే. ‘‘బీచ్లో నిర్వహించిన ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవు. అంతే కాకుండా రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ఆ పార్టీ సుదీర్ఘ సమయం కొనసాగింది. కోవిడ్-19 ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ నిబంధనలు, అభ్యర్థనలు ఏమాత్రం పాటించకుండా చాలా ఎక్కువ మంది ఒక చోట చేరి పార్టీ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మందిపై కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు తెలిపారు.