దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఆందోళన మొదలైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అక్కడ ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అది ఏ రాష్ట్రమో కాదు మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో సిబ్బందితో పాటు ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 66 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 61 మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 5 మంది ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
కరోనా పాజిటివ్ అయిన వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వీలు లేదు. వీరంతా వర్చువల్ పద్దతిలో సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా మధ్యప్రదేశ్లో మొత్తం 2 లక్షల 30 వేల కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీరిలో 3545 మంది కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డారు. ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని కలిసిన వారంతా ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. పలువురు టెస్టులు చేపించుకునేందుకు సిద్దమవుతున్నారు.