ఆంధ్రప్రదేశ్కు రూ. 3805 కోట్లు వచ్చేందుకు లైన్ క్లియరైంది. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ రావడం ఏపీకి శుభపరిణామం.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 8614.70 కోట్లు మంజూరు చేసింది. కాగా ఏపీ కూడా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేసింది. వీటిలో ఇంకా రూ. 3805 కోట్లు రావాల్సి ఉండగా.. కేంద్రం బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని చెప్పింది.
పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అందుకే బకాయిలు విడుదల చేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి నిధులన్నీ కేంద్రమే సమకూర్చాలన్నారు. దీనికి సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పోలవరం నిధుల వినియోగంపై కాగ్ నివేదికను ఏపీ అందజేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రూ. 3805 కోట్ల బకాయిలు త్వరలోనే చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ప్రకటనతో ఏపీకి త్వరలోనే ఈ బకాయిలు విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.