కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి ముఖ్యమంత్రుల వరకూ ఇది వ్యాపిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.
దేశంలో ఏ ముఖ్యమంత్రి కొన్ని గంటల పాటు కాలి నడకన నడుస్తూ ప్రజలను కలుసుకోవడానికి వెళ్లడు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఇది చేశారు. కొద్దిరోజుల క్రితం సీఎం పెమా ఖండూ తన నియోజకవర్గ ప్రజలను కలుసుకొనేందుకు ఆయన కొండలు, గుట్టలు లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లారు. తవాంగ్లోని ముక్తో నియోజకవర్గానికి రవాణా సౌకర్యం లేదు. కాలినడకనే నియోజకవర్గంలో పర్యటించాలి. అయితే ఆయన ఇదేమీ లెక్కచెయ్యకుండా 24 కిలోమీటర్లు 11 గంటల పాటు నడిచారు. ఓ ముఖ్యమంత్రి ఇంతదూరం నడవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కాగా ఇప్పుడు ఈయన కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవన్నారు. పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు సీఎం చెప్పారు. కరోనా విషయంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.