తుపాన్ మామూలు ప్రజలనే కాదు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఓ వైపు జనజీవనం పూర్తిగా స్తంబించిపోతుంటే.. మరో వైపు రైతులు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా బాధలు పడుతున్నారు. ఇక తుపాను కారణంగా వచ్చిన వాగు నీటిని దాటి వెళ్లలేక ఓ పెళ్లి కూడా ఆగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. వాగు దాటలేక పెళ్లి వాయిదా పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద మండ్యం మండలం పాపే పల్లి వద్ద వాగు ఉధృతి కారణంగా పెళ్లి కుమార్తె వాగు దాటలేకపోయింది. దీంతో పెళ్లి వాయిదా పడింది. పెద్దమండ్యం మండలం పాపేపల్లి గ్రామానికి చెందిన మమతకు బీ. కొత్తకోట మండలం దేవరాజు పల్లికి చెందిన సుధాకర్కు గట్టు వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. నిన్నటి రోజు ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. అయితే పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి బృందం పాపేపల్లి వద్ద వాగు దాట లేకపోవడంతో పెళ్లి వాయిదా పడింది.
ఇక ఏపీలో నివర్ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చించారు.