రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వారు శృతి మించి ఎక్కువగా మాట్లాడితే వారికి తెలికుండానే ఏదో ఒకటి అనేస్తారు. దీంట్లో లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. తాజాగా సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఇదే వివాదంలో పడ్డారు.
ఖష్బూ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆమెపై విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఖష్బూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడింది. మతిస్థిమితం లేని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఆ మాటే ప్రస్తుతం ఆమె పాలిట శాపంగా మారింది. ఖుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగుల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మూడు రోజుల వ్యవధిలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, మదురై, కోయం బత్తూరు, తిరుప్పూరు, సేలం, తిరునల్వేలి, కన్నియాకుమారి, విరుదునగర్ జిల్లాల్లో ఖుష్బూ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఖుష్బూ స్పందించారు. తాను దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. తనకు అలాంటి ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పారు. మతిస్థిమితం అనే చిన్న పొరపాటు మాట వల్ల ఖుష్బూ ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సో ఇప్పటికైనా పొలిటికల్ లీడర్స్ కాస్త వెనకా ముందు చూసుకొని మాట్లాడితే బాగుంటుందని పబ్లిక్ అనుకుంటున్నారు.