ఎయిర్ ఇండియా విమానం రన్నింగ్లో ఉంది. ఢిల్లీ నుంచి గోవాకు ఫ్లైట్ వెళుతోంది. ప్రయాణీకులంతా గోవా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ అలాగే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఓ వ్యక్తి లేచి విమానంలో ఉగ్రవాదులు ఉన్నారని కేకలు వేశాడు. తాను ప్రత్యేక యూనిట్ అధికారినని చెప్పాడు. అతని కేకలతో విమానంలో ఉన్న ప్రయాణీకులు, అధికారులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ-గోవా ఎయిర్ ఇండియా విమానంలో ఉగ్రవాదులున్నారని ఓ ప్రయాణికుడు పేర్కొనడంతో ప్రయాణికులు షాక్ కు గురైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి గోవాకు విమానం వెళుతుండగా మార్గమధ్యంలో ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి ఆకస్మాత్తుగా లేచి వింతగా ప్రవర్తించారు. విమానంలో ఉగ్రవాదులున్నారని, తాను ప్రత్యేక యూనిట్ అధికారినని పేర్కొన్నాడు. విమానంలో వింతగా ప్రవర్తించిన వ్యక్తి ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన జియాఉల్ హక్ గా గుర్తించారు.
దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం గోవాలో దిగిన తర్వాత జియాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. జియాకు మతిస్థిమితం లేదని అతని కుటుంబసభ్యులు చెప్పారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు చేసి పనాజీలోని హాస్పిటల్కి తరలించారు. విమానంలో ఒక్కసారిగా ఉగ్రవాదుల పేరు వినపడంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫైనల్గా సినిమాల్లో చూపించిన విధంగా ఈ ఫ్లైట్ సీన్ ఉందని పలువురు డిస్కషన్ చేసుకున్నారు.