ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానేవచ్చింది. యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజున ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’తో ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని చెప్పిన చిత్రయూనిట్ దానికి తగినట్లుగానే అభిమానులకు ఓ మధురానుభూతిని పంచింది. ఈ టీజర్ను పూర్తిగా గ్రాఫిక్స్ తోనే రూపొందించారు. అయితే దీని ద్వారా సినిమా కాన్సెప్ట్ ను చెప్పకనే చెప్పేసింది చిత్ర యూనిట్.
ఇక ఈ టీజర్ను గమనిస్తే వేగంగా వెళుతోన్న రైలులో కొన్ని జంటలను చూపిస్తూ చివరిగా ప్రభాస్, పూజాలను చూపించారు. ఈ క్రమంలో చరిత్రలో నిలిచిపోయిన లైలా.. మజ్ను, పార్వతీ.. దేవదాసు, రోమియో.. జూలియట్లను చూపించారు. ఈ లెక్కన చూస్తే రాధే శ్యామ్ జంట కూడా చరిత్రలో నిలిచే ఓ ప్రేమ జంట అని సంకేతమిచ్చారు. ఇటీవల పూజా హెగ్డే కూడా ఈ సినిమా చారిత్రక ప్రేమికుల స్ఫూర్తితో తెరకెక్కుతోందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్వ జన్మల నేపథ్యంలో ఉండనుందని అప్పట్లో కొన్ని వార్తలు షికార్లు చేశాయి. యావత్ దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.