అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ట్రంప్ను మోదీ మిత్రుడిగా ఎన్నోసార్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ట్రంప్ ఇండియాపై కాస్త నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. ఇటీవల వరుసబెట్టి ఇండియాపై కామెంట్లు చేస్తున్నాడు.
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికలు భారత్లో ప్రధాని నరేంద్రమోదీకి అంటుకున్నట్లున్నాయి. అక్కడ ట్రంప్ ఏం మాట్లాడినా ఇక్కడ మోదీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మొన్న కరోనా కేసుల విషయంలో ఇండియాపై నోరుపారేసుకున్న ట్రంప్ మరోసారి భారత్ను టార్గెట్ చేశారు. ఈ సారి ఏకంగా కాలుష్యంపై మండిపడ్డారు. 2015లో ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్ వార్మింగ్పై ఒప్పందం కుదిరింది. 2017లో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి అంశం గురించి చర్చ వస్తోంది. కాలుష్యంపై వచ్చిన చర్చలో పారిస్ ఒప్పందం గురించి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో ట్రంప్ చెప్పారు.
ఈ క్రమంలో భారత్పై విమర్శలు గుప్పించారు. భారత్, చైనా, రష్యా దేశాల్లో వాయు కాలుస్యం అత్యంత మురికిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. చైనా దేశం కాలుష్యంతో నిండిపోయిందని, రష్యా, ఇండియా దేశాలు వాయు కాలుష్యంతో పూర్తిగా నిండిపోయిందని ట్రంప్ ఆరోపించారు. వాతావరణ మార్పుల అంశంలో భారత్, చైనా దేశాలు ఎలాంటి సహకారం అందించలేదని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రతిపక్షాలు వ్యంగంగా మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ హౌడీ మోదీ కార్యక్రమం వల్లే భారత్ లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా మారిందని చురకలంటించారు. అమెరికాతో భారత్ స్నేహం చేసినా.. ట్రంప్ ఆడిపోసుకున్నారని మండిపడ్డారు. భారత్లోని కోవిడ్ మరణాలపై ట్రోల్ చేశారని ఇప్పుడు కాలుష్యంపై కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఇవన్నీ హౌడీ మోదీ ఇచ్చిన ఫలితాలని కపిల్ సిబాల్ చురకలంటించారు.