తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన కలిసి పరామర్శిస్తున్నారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు. వివిద గ్రామాల్లోని పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రైతులేని రాజ్యంగా చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రైతులను అవమానించే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదని.. ఇది నా హెచ్చరిక అంటూ లోకేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలన్నారు.
రూ.2 వేల కోట్లు వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగిందని. ఇప్పటివరకు కేవలం రూ.25 లక్షలు మాత్రమే నష్ట పరిహారం ఇచ్చారన్నారు. 15 నెలలుగా ఇన్పుట్ సబ్సిడీ.. డ్రిప్ ఇరిగేషన్.. ఇన్సూరెన్స్ ఇవ్వలేదని.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. అయితే లోకేష్ ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటుంటే టిడిపి శ్రేణులు సంతోషంలో ఉన్నాయి. అధినేత రాకపోయినా లోకేష్ వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే గతానికి ఇప్పటికీ లోకేష్ స్టయిల్ మారిందని పలువురు మాట్లాడుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం మంచిదే అయినా కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి చేస్తారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే మేలని లోలోపల చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాకుండా ఎంత మందిని పంపించినా పార్టీ ఇమేజ్ పెరగదని పబ్లిక్ కూడా డిస్కషన్ చేస్తున్నారు.