బీహార్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఒకే రోజు బీహార్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా రాహుల్ బీహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీపై విరుచుకుపడ్డారు.
దేశం కోసం బిహార్ పౌరులు తమ ప్రాణాలనే ఇచ్చారని. వారికి నమస్కారం. అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్గా రాహుల్ మాట్లాడారు. . ఈ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. గల్వాన్ లోయలో బీహార్కు చెందిన జవాన్లు అమరులయ్యారని రాహుల్ అన్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకురాలేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొరబడలేదని మోదీ వ్యాఖ్యానించి భారత సైన్యాన్ని అవమానపరిచారని విమర్శించారు. చైనా జవాన్ల చొరబాటును వ్యతిరేకిస్తూ మన జవాన్లు ధీరోదాత్తంగా పోరాడి వారి ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు.
చైనా బలగాలు భారత్ భూభాగం నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయో చెప్పాలని ప్రధానిని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల బీహార్లోని మార్కెట్ యార్డులకు మద్దతు దర తీవ్రంగా దెబ్బతిందన్నారు. గత ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారని చెబుతూ.. ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదని మండిపడ్డారు. బీహారీలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారని విరుచుకుపడ్డారు. రైతులకు, జవాన్లకు, కార్మికులకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానంటూ బిహార్లో మోదీ ప్రకటిస్తారని, కానీ ఢిల్లీకి వెళ్లగానే అదానీ, అంబానీల కోసమే పని చేస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు.