జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రదాడుల్లో చనిపోయింది ముగ్గురు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఈ దాడుల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ విషయంపై స్పందించారు.
జమ్మూకశ్మీరులో బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడి ఘటనను ప్రధాని నరేంద్రమోదీ ఖండించారు. జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఖాజిగుండ్ ప్రాంతంలోని వైకె పొరా గ్రామంలో గురువారం రాత్రి 8.20 గంటలకు బీజేపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కుల్గాం జిల్లా బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిధాహుసేన్ యాటూ, ఉమర్ రషీద్ బీగ్, ఉమర్ రంజాన్ హజామ్ లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని వైద్యులు ప్రకటించారు. అయితే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఇప్పుడు కొత్తేమీ కాదు. కాగా ఇటీవల దాడులు తీవ్రతరం అయ్యాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రెనెడ్లు విసరడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గంలో స్లీపర్ సెల్స్కు ఆయుధాలు అందించేందుకు కూడా సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో ఈ దాడి చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఏమాత్రం అదుపులో లేవు. ఏ క్షణం ఏం జరుగుతందో అన్న ఆందోళన నెలకొంది.