కరోనా కేసులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కరోజులోనే 90వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవ్వడం ఇప్పుడు భయానక పరిస్థితులను తలపిస్తోంది.
అమెరికాలో కరోనా కేసుల తీవ్రత చూస్తే ఆందోళన కలుగుతోంది. ఇన్ని రోజులు సాదారణ స్థాయిలో నమోదవుతున్న కేసులు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే 90వేలకు పైగా కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. దేశంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 గంటల్లో 90వేలకు పైగా మంది కొవిడ్ బారినపడడం ఇదే మొదటిసారి అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. అక్టోబర్ నెల మధ్య నుంచి యూఎస్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతూ వస్తోంది.
ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో గురువారం రాత్రి 8.30 గంటల వరకు 91,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 9.21 మిలియన్లకు చేరింది. అలాగే 2.30 లక్షలకు పైగా మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కాగా, ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా వరకు మరోసారి లాక్డౌన్ విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు కూడా పెట్టాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలో కేసులు ఈ స్థాయిలో నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశమే.
కరోనా రెండో సారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు అమెరికాలో నమోదైన కేసులను బట్టి చూస్తే అమెరికాలో కూడా సెకండ్ వేబ్ మొదలైందా అన్న చర్చ మొదలైంది. ఇక ఇండియాలో కూడా మరో నెల రోజుల్లో కరోనా తీవ్రత పెరుగుతుందన్న వార్తలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇదే నిజమైతే ఇండియాలో మరోసారి లాక్డౌన్ విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.