ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద తెల్లవారుజామునుంచే పోలీసులు మొహరించారు. కుప్పంలో ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు , రామకుప్పం మండలంలో టీడీపీ మండలాధ్యక్షుడు అంజినేయరెడ్డి, మండల ఇన్చార్జి మునస్వామిలతో పాటూ పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పాదయాత్రకు టీడీపీ సిద్ధమైన నేపథ్యంలో వ్యతిరేకంగా వైసీపీ కూడా ఆందోళనకు సిద్ధమైంది. దీంతో కుప్పానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి.
దీంతో టిడిపి నేతల గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హంద్రీనీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. గృహనిర్బంధం ఎత్తివేసి అక్రమ కేసులు తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.